న్యూఢిల్లీ,జూన్ 9: ఓదార్పు యాత్ర మూలంగా కాంగ్రెస్ అధినాయకత్వంతో పేచీ పెట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడు, లోక్సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్.సి.పి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్తో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుండటం తెలిసిందే. కాంగ్రెస్ అధినాయకత్వం నుండి అందిన సూచన మేరకు జూలై 8 తేదీ వరకు తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు జగన్ ప్రకటించటం తెలిసిందే. కాంగ్రెస్ అధినాయకత్వం జూలైలో కూడా ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వని పక్షంలో ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ముందుకున్న ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే కార్యక్రమంలో భాగంగానే ఆయన శరద్ పవార్తో మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ అధినాయకత్వం తనను కట్టడి చేయటం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి కొత్త సమీకరణాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్ రాజకీయం గురించి శరద్ పవార్తో చర్చించారని అంటున్నారు. ఎన్.సి.పిలో చేరాలంటూ శరద్ పవార్ చేసిన ప్రతిపాదన గురించి జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా అసమ్మతి నాయకుడిగా కొనసాగుతున్నప్పుడు శరద్ పవార్తో దోస్తీ చేయటం తెలిసిందే. శరద్ పవార్ సలహా మేరకే ఆయన ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభించే దిశగా ప్రయత్నాలు కూడా జరిపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన భవిష్యత్ రాజకీయం కోసం శరద్ పవార్ వైపు చూస్తున్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు ప్రకటించిన ప్రకారం జూలై ఎనిమిదో తేదీనాడు శ్రీకాకుళంలో ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేరోజు ఆయన తన భవిష్యత్ రాజకీయ కార్యక్రమం గురించి ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.
Loading Poll...